
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 22, 2024 న డ్రోన్ సమ్మిట్ ను అమరావతిలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 6, 929 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ డ్రోన్ సమ్మిట్లో పలు శాఖలకు సంబంధించిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ప్యానెల్ డిస్కషన్లో పరిశ్రమ నిపుణులు, శాస్త్రవేత్తలు, మరియు ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్య ప్యానెల్ సభ్యులు గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కిన్జరాపు రామ్మోహన్ నాయుడు, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో 9 ప్యానెల్ డిస్కషన్లు, 50 స్టాళ్లలో డ్రోన్ల ప్రదర్శన జరిగింది. రాష్ట్ర డ్రోన్ పాలసీ ముసాయిదా ను ఆవిష్కరించారు.డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్ ను డ్రోన్ హబ్ గా మార్చడమే ఈ సమ్మిట్ యొక్క ప్రధాన లక్ష్యం గా ఉంది. పౌర విమానాయన శాఖ, డి ఎఫ్ ఐ, సిఐఐ భాగస్వామ్యంతో ఈ సమ్మిట్ నిర్వహించారు. ఈ సమ్మిట్ ను రెండు రోజులు నిర్వహించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, ఈ డ్రోన్ల వినియోగం వ్యవసాయ రంగంలో నూ, మౌలిక వసతులు, ట్రాఫిక్ నియంత్రణలోనూ చాలా ఉపయోగకరంగా ఉంటుందని, చాలా మార్పులు వస్తాయని చెప్పారు. భవిష్యత్తులో ఈ డ్రోన్ల వినియోగం విస్తృతం అవుతుందని, ఆంధ్రప్రదేశ్ ను డ్రోన్ టెక్నాలజీ హబ్ గా మార్చడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ సమ్మిట్లో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ (APDC) రెండు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది. ఐఐటీ తిరుపతి నవావిష్కార్ ఐ హబ్ ఫౌండేషన్ మరియు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI)తో ఎంఓయూలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో డ్రోన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, క్వాలిటీ అస్యూరెన్స్ పెంచడం, ఏపీలో డ్రోన్ రంగం అభివృద్ధికి అనువైన వాతావరణం కల్పించేందుకు మార్గం ఏర్పడుతుందని ప్రభుత్వం పేర్కొంది.
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో అడ్వాన్స్డ్ అటానమస్ డ్రోన్ సిస్టం, కృత్రిమ మేధ (AI) ఆధారిత అనలిటిక్స్, జియోస్పేషియల్ ఇంటిగ్రేషన్ వంటి రంగాల్లో పరిశోధన, అభివృద్ధి జరుగుతుంది. శిక్షణ, నైపుణ్య కార్యక్రమాల ద్వారా పరిశ్రమ అవసరాల కోసం UAV టెక్నాలజీల్లో నిపుణులైన మానవ వనరులను తీర్చిదిద్దడానికి సర్టిఫికేషన్ అందిస్తున్నారు. స్టార్టప్ల కోసం డ్రోన్ ఆధారిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి ఇంక్యుబేషన్ సౌకర్యాలు, మెంటారింగ్, పెట్టుబడి నెట్వర్క్ కల్పిస్తున్నారు.
ఈ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ డ్రోన్ టెక్నాలజీలో ముందంజలో ఉండేందుకు మరింత ప్రోత్సాహం లభించనుంది.