
వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకాల వివాదం ఇటీవల మరింత చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ, వైసీపీ అధినేత జగన్ మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మధ్య ఉన్న ఈ వివాదంపై బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖపై వైసీపీ ఘాటుగా స్పందిస్తూ కౌంటర్ లేఖను విడుదల చేసింది. ఈ రెండు లేఖల మధ్య వివాదం మరింత తీవ్రతరమవుతోంది.
వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ:
వైఎస్ విజయమ్మ తన బహిరంగ లేఖలో కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నంత వరకు ఆయన కుటుంబం ఆనందంగా ఉండేదని, ఇప్పుడు ఆ కుటుంబానికి దిష్టి తగిలినట్లు అనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. “ఎంత ప్రయత్నించినా నా కళ్ల ముందే జరుగుతున్న సంఘటనలు నాకు బాధను కలిగిస్తున్నాయి” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాక, ఆస్తుల పంపకం తన సమక్షంలోనే జరిగిందని, జగన్, షర్మిల అనుకూలంగా ఆ పంపకం జరిగినట్లు వివరించారు. “2019లో రాసుకున్న ఎంవోయూ ప్రకారం షర్మిలకు హక్కులు ఉన్నాయి. అందుకే ఆమెకు రూ.200 కోట్ల డివిడెండ్లు ఇచ్చారు. షర్మిలకు హక్కులు ఉండే కారణంగానే అధికారికంగా ఎంవోయూ రాసుకున్నారు. షర్మిలకు ఇచ్చే ఆస్తులు జగన్ గిఫ్ట్గా ఇవ్వడం లేదు, బాధ్యతగా ఇస్తున్నాడు” అని స్పష్టం చేశారు. ఎంవోయూలో పేర్కొన్న సరస్వతి షేర్స్ 100 శాతం, ఎలహంక ప్రాపర్టీ 100 శాతం షర్మిలకు వెంటనే ఇవ్వాలని జగన్ మాట ఇచ్చి సంతకం కూడా పెట్టినట్లు వెల్లడించారు. అవి ఇవ్వకుండా, అటాచ్మెంట్లో లేని ఆస్తుల విషయంలో కూడా షర్మిలకు అన్యాయం జరిగినట్లు పేర్కొన్నారు.
విజయమ్మ వైఎస్ అభిమానులకు బహిరంగ లేఖ ద్వారా పిలుపునిస్తూ, ఆస్తుల వివాదంపై ఎక్కువగా మాట్లాడవద్దని, అనవసర కథనాలు, దూషణలు చేయొద్దని కోరారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె పిల్లల గురించి అనవసరంగా కథనాలు రాయడం, విమర్శించడం ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య అన్నా చెల్లెల్ల మధ్య మాత్రమేనని, వారే దీనిని పరిష్కరించు కోవాలనుకుంటున్నారని ఆమె స్పష్టం చేశారు.
వైసీపీ కౌంటర్ లేఖ:
వైఎస్ విజయమ్మ లేఖపై వైసీపీ కూడా కౌంటర్ లేఖతో ఘాటుగా స్పందించింది. “జగన్కు ఎదురవుతున్న న్యాయపరమైన ఇబ్బందులు, ఆయన బెయిల్ రద్దు చేసేందుకు జరుగుతున్న కుట్రలను విజయమ్మ ఎందుకు ప్రస్తావించలేదు?” అని వైసీపీ ప్రశ్నించింది.
అలాగే, వైఎస్ కుటుంబంపై ప్రతిరోజూ కుట్రలు పన్నే చంద్రబాబుకు మేలు చేసేలా షర్మిల వ్యవహరిస్తుండడం ధర్మమేనా అని ప్రశ్నించింది. తెలంగాణలో రాజకీయాల్లో అడుగుపెట్టిన నాటినుంచి జగన్పై ఎప్పుడూ విమర్శలు చేస్తూ వచ్చిన షర్మిల, ఎన్నికల సమయంలో జగన్పై జరిగిన దాడిని ఎగతాళి చేస్తూ, అమానవీయంగా మాట్లాడినట్లు లేఖలో పేర్కొంది. ఈ అన్ని అంశాలను జగన్ ఓపికతో భరించారని, అయినప్పటికీ ఇప్పుడు ఎవరు రచ్చకెక్కారు? వైఎస్ కుటుంబ పరువు తీసిన వారు ఎవరు? షర్మిల కాదా? అంటూ వైసీపీ ప్రశ్నించింది.
ఆస్తుల పంపకాలు, షేర్ల బదిలీ ప్రక్రియ విషయంలో కుట్రలు జరుగుతున్నాయని వైసీపీ తన లేఖలో స్పష్టం చేసింది. షర్మిల వైఖరి చంద్రబాబుకు మేలు చేసేలా ఉందని, ఆమె ప్రవర్తన ధర్మానికి వ్యతిరేకమని విమర్శలు చేసింది. వైఎస్ కుటుంబంలో ఉండే వివాదాలపై వైసీపీ తన నిరసనను వ్యక్తం చేసింది,
ఈ రెండు పరస్పర లేఖలు తో వివాదం మరింత ముదురుతోంది. వైఎస్ కుటుంబంలోని ఆస్తుల వివాదం ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధంగా కొనసాగుతోంది.