వైసీపీ నేత విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం: రాజ్యసభకు రాజీనామా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇకపై రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఆలోచన లేదని, ఇతర పదవులు ఆశించడం లేదని స్పష్టం చేశారు.

తన ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని విజయసాయిరెడ్డి తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటూ, వారి ఆదరాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సేవలందించేందుకు జగన్ ఇచ్చిన అవకాశాలను తన జీవితంలో మరువలేనివిగా అభివర్ణించారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించిన ఆయన, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఫ్లోర్ లీడర్‌గా కూడా కీలక పాత్ర పోషించారు.

విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం తగ్గనుంది. 2024లో పార్టీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య ఏడుగురికి తగ్గిపోయింది. ఇప్పటికే ఆర్. కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రాజీనామాలు చేయగా, విజయసాయిరెడ్డి తాజా నిర్ణయం పార్టీకి ఎదురుదెబ్బగా మారింది. ఈ క్రమంలో అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.

పార్టీకి, రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య వారధిగా పనిచేసిన విజయసాయిరెడ్డి, చివరిగా మోదీ, అమిత్ షా సహా పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. రాజకీయాల నుంచి వీడ్కోలు ప్రకటించిన విజయసాయిరెడ్డి నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి