Telugu Vibe Spotlight: జగన్ 2.0 – నిజమైన మార్పా? లేక మాయామాత్రమా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కొత్త వర్షన్ “జగన్ 2.0” చూస్తారు అంటూ ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నారు. ఈ కొత్త వర్షన్ అన్ని విధాలుగా భిన్నంగా ఉండబోతుందని, ఇకపై క్యాడర్ కోసం నిజంగా పని చేస్తానని పదే పదే చెబుతున్నారు.

ఎందుకు ఈ మార్పు?

గత ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థ ఆధారంగా మళ్లీ అధికారంలోకి రావాలని భావించిన వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం 11 స్థానాలకు పరిమితం కావడం వెనుక ప్రధాన కారణం క్యాడర్‌ను దూరం చేసుకోవడమేనని జగన్ గ్రహించినట్లు కనిపిస్తోంది. అందుకే ఇటీవల “జగన్ 2.0 చూస్తారు” అంటూ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నింపాలని ప్రయత్నిస్తున్నారు. మరో అడుగు ముందుకు వేస్తూ “మళ్లీ అధికారం మనదే” అని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ “30 ఏళ్లు వైసీపీ అధికారంలో ఉంటుందంటూ” మళ్లీ పాత డైలాగ్‌లను రిపీట్ చేయడం మొదలుపెట్టారు. అధికారంలో ఉన్నంత వరకు “Why not 175?” అనే మాటలు పలికిన జగన్, ఇప్పుడు 30 ఏళ్లపాటు వైసీపీనే పాలన చేస్తుందనడం పై విమర్శలు వినిపిస్తున్నాయి. క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని అనుకునే ఈ వ్యాఖ్యలు, ప్రజల్లో నెగటివ్ ప్రభావం చూపించే అవకాశముంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగిస్తే, ప్రజలు పూర్తిగా దూరమవుతారు. ప్రజలు గెలిపించగలరు మళ్లీ అదే ప్రజలు ఓడించగలరు, కానీ పొగరును అస్సలు సహించరు. అధికారం కోసం మార్పు అనేది మాటల్లో కాక, చేతల్లో కనిపించాలి.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల్లో, ప్రజలు కూటమి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఇంకా జగన్‌నే చూస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం ఎదుర్కొన్నప్పటికీ, 40% ఓటు షేర్ సంపాదించగలిగింది. ఇది జగన్‌కు ఇప్పటికీ గట్టి మద్దతుదారులు ఉన్నారనే సంకేతం.

ఇప్పుడిక జగన్ మళ్లీ ప్రజల్లోకి వస్తే, మరింత బలపడే అవకాశం ఉందా? ఓటమి తర్వాత ఆయన తన రాజకీయ విధానాన్ని మార్చుకుంటారా? లేక క్యాడర్‌ను ఉత్సాహపరిచేంతవరకే పరిమితం అవుతారా? అన్నదే అసలు ప్రశ్న. ప్రజల్లో తిరిగి విశ్వాసాన్ని పెంచుకోవాలంటే, గత పాలనలో చేసిన తప్పులను అర్థం చేసుకుని, నిజమైన మార్పును చూపాల్సిన అవసరం ఉంది.

అధికారం శాశ్వతం కాదు!

ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రజలు కోరుకుంటేనే అధికారం మళ్లీ వరిస్తుంది. నిజంగా 30 ఏళ్లపాటు పాలించాలంటే, మాటలు కాదు ప్రజలకు నిజమైన, విశ్వసనీయమైన పాలన అందించాలి. “జగన్ 2.0” అంటే ప్రజల కోసం మారిన పాలనా ధోరణా? లేక కేవలం క్యాడర్‌ను మళ్లీ చైతన్యవంతం చేయడానికే రచ్చేనా? సమాధానం కోసం వేచి చూడాల్సిందే!

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి