
రఘురామకృష్ణరాజు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎంపికకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఎన్డీయే కూటమి పక్షం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని కూటమి నేతలతో చర్చించి రఘురామకృష్ణరాజును పేరును ఖరారు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది, రఘురామ త్వరలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
రఘురామ రాజు ఎంపిక లాంఛనప్రాయంగానే జరగనుంది, ఎందుకంటే ఎన్డీయే కూటమికి శాసనసభలో స్పష్టమైన మెజారిటీ ఉంది. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, పైగా వారు శాసనసభకు హాజరు కావడం లేదు. ఈ పరిస్థితుల్లో రఘురామ రాజు ఏకగ్రీవంగా డిప్యూటీ స్పీకర్గా ఎన్నికవుతారని అంచనా.
రఘురామకృష్ణరాజు రాజకీయ ప్రస్థానంలో కూడా ఆసక్తికర మార్పులు జరిగాయి. బీజేపీతో తన రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన, 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. కొంతకాలానికే జగన్ పాలనపై విమర్శలు చేస్తూ రెబల్గా మారిన రఘురామ, చివరికి టీడీపీలో చేరారు. ఉండి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు ఆయన ఎన్డీయే పక్షం ద్వారా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిని అలంకరించనున్నారు.