తిరుమలలో రథసప్తమి మహోత్సవం – మాడ వీధుల్లో భక్తుల జలసంధ్రం

శ్రీవారి రథసప్తమి ఉత్సవాలతో తిరుమల శోభాయమానంగా మారింది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేరుగాంచిన ఈ పర్వదినం సందర్భంగా శ్రీవారు ఏడు వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలలో తొమ్మిది రోజులు శ్రీవారు 16 వాహనాలపై విహరిస్తారు. అయితే, రథసప్తమి రోజున ఒక్క రోజే ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వడం విశేషం.

సకల జీవకోటికి వెలుగు ప్రదాత అయిన సూర్యభగవానుడు, జనులకు ప్రత్యక్ష నారాయణుడుగా భావిస్తారు. ఆయన జన్మదినమైన సూర్యజయంతి రోజున రథసప్తమి వేడుకలను టీటీడీ ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇవాళ తెల్లవారుజామున సూర్యోదయ సమయానికి శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహనసేవ ఉదయం 5 గంటలకు ప్రారంభమైంది. సరిగ్గా 6:44 గంటలకు మలయప్ప స్వామి పాదాలపై సూర్యకిరణాలు పడేలా ముహూర్తం నిర్ణయించారని పండితులు తెలిపారు.

రాత్రి వరకు కొనసాగే ఈ ఉత్సవంలో శ్రీనివాసుడు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై భక్తులను కటాక్షించనున్నారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 200 గ్యాలరీలు, 65 ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసి, ప్రతి గంటకు భక్తులకు అన్నపానీయాలను అందించేలా చర్యలు తీసుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేసింది.

తిరుమలలో ఘనంగా నిర్వహిస్తున్న ఈ రథసప్తమి వేడుకలు భక్తులకు దైవానుభూతిని కలిగిస్తున్నాయి. శ్రీనివాసుని కటాక్షాన్ని పొందేందుకు వేలాది మంది భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి