
గుంటూరు మిర్చి రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అరుగులం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో, పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గతేడాది క్వింటాల్ మిర్చి రూ. 22,000కి అమ్ముడవగా, ఈ సంవత్సరం కేవలం రూ. 13,000కే అమ్మకాలు జరుగుతున్నాయి. ఇలాంటి తీవ్రమైన ధర పతనంతో, రైతులు తమ భవిష్యత్తు ఏంటో అర్థం కాక ఆవేదన చెందుతున్నారు.
నిన్న మాజీ సీఎం జగన్ గుంటూరు జిల్లాలో రైతులను పరామర్శించగా, టీడీపీ నేతలు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించి జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ రైతులు మాత్రం “రాజకీయాలు పక్కనపెట్టి, మా సమస్యలపై దృష్టి పెడితే మేము బతుకుతాం” అని వాపోతున్నారు. గతేడాది ధరలు పెరగడాన్ని వైసీపీ నేతలు తమ ప్రభుత్వం గొప్పతనంగా చెప్పుకుంటుంటే, మరోవైపు అప్పటి పరిస్థితులు ఇంతకంటే తీవ్రంగా ఉన్నాయని టీడీపీ వర్గాలు ప్రతిస్పందిస్తున్నాయి. కానీ, ఇలాంటి పరస్పర ఆరోపణలతో రైతుల కష్టాలు తీరిపోతాయా? అసలు రైతన్న బతికి బట్టకట్టే పరిస్థితిని ఎవరు కల్పిస్తున్నారు?
ఒకవైపు రైతులు కష్టాల్లో మునిగితే, మరోవైపు నేతలు రాజకీయ లబ్ధి కోసం మాటల యుద్ధం చేస్తారా? కనీసం రైతుల బాధను అర్థం చేసుకోగలిగే మనసు నాయకులకి ఎప్పుడు వస్తుంది?
రైతన్న కన్నీళ్లు తుడవాల్సింది పోయి, రాజకీయ లాభాల కోసం మాటల తూటాలు పేల్చడం ఎంత వరకు సమంజసం? రైతులు తమ ఉనికి కోసం పోరాడుతున్న ఈ సమయంలో, ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి వ్యవసాయాన్ని దన్నుగా నిలిపేలా చర్యలు తీసుకోవాలి. ఒక రైతు కన్నీటి విలువను గుర్తించే పాలకులు అవసరం అధికారంలో ఎవరు ఉన్నా, రైతుకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిదీ!
గుంటూరు మిర్చి మార్కెట్లో కనీసం మార్కెట్ చైర్మన్ కూడా లేని పరిస్థితిని రైతులు ఎత్తిచూపుతున్నారు. తమ సమస్యలను ఎవరి వద్ద చెప్పుకోవాలి? ప్రభుత్వం తక్షణమే స్పందించి, రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించాలి. రాజకీయాలను పక్కనపెట్టి, రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా నిర్ణయాలు తీసుకోవాలి.
రైతన్న మళ్ళీ తన పొలంలో అడుగుపెట్టేంత భరోసా ఇవ్వాలి. పెట్టుబడులు, రుణభారం, మార్కెట్ అనిశ్చితి ఇవన్నీ రైతన్న జీవితం మీద మోపేసిన భారమైపోయాయి. ప్రభుత్వం, ప్రతిపక్షం ఇద్దరూ రాజకీయ లబ్ధిని ఆలోచించే సమయం కాదు, రైతులకు హక్కుగా రావాల్సిన మద్దతు ధరను ప్రకటించే సమయం ఇది. రైతుల కన్నీళ్లు ఆగాలి. వారి కష్టం విలువైనదే అనే సత్యాన్ని గుర్తుంచుకుని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న రైతన్నకు న్యాయం జరగాలి!