ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్?

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి సిద్దమయ్యారు. ఫిబ్రవరి 1న న్యూఢిల్లీలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశముంది. తెలుగు ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఢిల్లీలో సుమారు 10 లక్షల మంది తెలుగు ప్రజలు నివసిస్తుండటంతో ఈ ప్రచారం కీలకంగా మారనుంది.

ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి. సమయం ఆసన్నమవుతుండటంతో అన్ని ప్రధాన పార్టీలూ తమ ప్రచారానికి వేగం పెంచాయి.

ఎన్డీఏ మిత్రపక్షంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటంతో బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబును ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రాధాన్యత గల ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. గతంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వీరిద్దరూ వేర్వేరు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ అభ్యర్థులు మరింత బలం పొందేలా పార్టీ ప్రయత్నిస్తుండటంతో ఈ ప్రచారం కీలకంగా మారింది. రాజకీయంగా ప్రభావం చూపగల నేతలు ప్రచారానికి దిగటంతో ఢిల్లీ ఎన్నికలలో ఆసక్తికరమైన పరిస్థితులు నెలకొన్నాయి.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి