ఆంధ్రప్రదేశ్ పాఠశాలల సమయాల పొడిగింపు: పైలట్ ప్రాజెక్ట్ వెనుక ఉన్న లక్ష్యం ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత పాఠశాలల సమయాలను పొడిగించేందుకు కీలక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉన్న పాఠశాల సమయాన్ని 5 గంటల వరకు పెంచే నిర్ణయం తీసుకోగా, ఈ మార్పును ప్రాథమికంగా పైలట్ ప్రాజెక్ట్ రూపంలో అమలు చేయనుంది.

ప్రతి మండలంలో రెండు పాఠశాలలను ఎంపిక చేసి, నవంబర్ 25 నుండి నవంబర్ 30 వరకు కొత్త సమయాలతో పాఠశాలలు నడపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సబ్జెక్టుల బోధనకు మరింత సమయం కేటాయించి, విద్యార్థుల అభ్యాసం మెరుగుపరచడమే ఈ మార్పు ముఖ్య ఉద్దేశ్యం. పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలను విశ్లేషించిన తర్వాత ప్రభుత్వం తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది.

స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ సూచనల ఆధారంగా 2024-25 విద్యా సంవత్సరంలో సమయాలను సవరించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అయితే, విద్యార్థులు, ఉపాధ్యాయుల పనిభారం యథావిధిగా ఉంటూ, ప్రతి పాఠం కోసం కావాల్సిన సమయం పెంపును మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

పైలట్ ప్రాజెక్ట్ కోసం ప్రతి మండలానికి చెందిన ఒక హైస్కూల్ లేదా హైస్కూల్ ప్లస్‌ను డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు గుర్తించి, నవంబర్ 20 నాటికి జాబితాను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. గుర్తించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సంబంధిత సమాచారం చేరవేయడంతో పాటు, 25 నుండి 30 వరకు కొత్త సమయాలను అమలు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఫీడ్‌బ్యాక్ నివేదికను నవంబర్ 30 నాటికి సమర్పించాలని డీఎస్‌ఈ సూచించింది.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి