మద్యం, ఇసుక పాలసీలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు

మద్యం షాపుల్లో ఎవరైనా MRP ధరలకు మించి ఒక రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కఠినమైన ఆదేశాలు ఇచ్చారు. అమరావతిలో మద్యం ధరలు, ఇసుక సరఫరా అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, మద్యం పాలసీ అమలు తీరుపై అధికారులతో చర్చించారు. MRPకి మించి మద్యం అమ్మినట్లయితే మొదటి సారి రూ. 5 లక్షలు జరిమానా విధించాలని, రెండోసారి అలాంటి తప్పు జరిగినప్పుడు షాపు లైసెన్స్‌ను రద్దు చేయాలని సూచించారు. బెల్ట్ షాపులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని ఆదేశించారు. ఈ క్రమంలో, బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసిన లిక్కర్ షాపుల యజమానులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.

ప్రతి మద్యం షాపులో సీసీ కెమెరాలు ఉండాలని, వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ వ్యవస్థల పర్యవేక్షణ కోసం కేంద్ర మానిటరింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఇసుక సరఫరా అంశాలపై సీఎం చంద్రబాబు అధికారులకు మరిన్ని సూచనలు చేశారు. ఇసుక రీచ్‌ల నుంచి సరఫరా సజావుగా కొనసాగేలా అన్ని చర్యలు తీసుకోవాలని, పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలింపులను పూర్తిగా అడ్డుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా ఇసుక అక్రమంగా తరలిస్తే సంబంధిత అధికారులపైనే మొదటగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక, మద్యం విషయాల్లో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉందని, ప్రజల ఆర్థిక భారం తగ్గేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి